కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల(kondagattu, Dharmapuri, kotilingala,)

ఆదివారం ఒక్క రోజు లో హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి రాత్రికి వచ్చెట్టు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించి మా ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఆధారంగా వేసిన ప్లాన్

1. కొండగట్టు ఆంజనేయస్వామి
2. ధర్మపురి నరసింహస్వామి
3.కోటిలింగాల కోటేశ్వర స్వామి
4. బీర్ పూర్ లక్ష్మి నరసింహస్వామి
5.వేములవాడ.

వీలైతే దారిలో వస్తూనో పోతూనో వర్గల్ సరస్వతి అమ్మవారు రత్నాలయం వెంకటేశ్వర స్వామిని కవర్ చేయాలని ప్లాన్.

ఇది ప్రోగ్రాం.


కానీ లేట్ గా బయలుదేరడం వల్ల ఎన్ని వీలయితే అన్ని చూద్దాంలే అనుకున్నాం.

దాదాపు 8:30 కి ఉప్పల్ నుంచి బయలుదేరాం. 

కొండగట్టు మొదట చేరున్నాం. ( వేములవాడ పైనుంచే వెళ్ళాం కాని వచ్చెప్పుడు చూద్దామనుకున్నాం.) అక్కడ ద్విముఖ ఆంజనేయస్వామి, పక్కన పద్మావతి అలివేలుమంగ అమ్మవార్లతో కూడిన వేంకటేశ్వరస్వామి కూడా ఉంటారు. ఈ స్వామి ని ప్రార్థిస్తే మనసులో కోరికలు తప్పకుండా తీరుతాయని ప్రతీతి. అంతేకాదు.. తీరని ఆరోగ్య సమస్యలున్న వాళ్లు నలభై రోజులు ఇక్కడ గుట్టపై స్వామికి సమీపంలో ఉంటూ రోజూ దర్శిస్తూ నిద్ర చేస్తే నయమయి పోతుందని ప్రసిద్ధి. చాలామంది ఉంటారు. మానసికమయిన సమస్యలున్నా తీరుతాయని అంటుంటారు. మంగళవారం, శనివారం రద్దీ ఎక్కువ. మిగిలిన సమయాల్లో అరగంటలో అయిపోతుంది.

అక్కడనుంచి ధర్మపురి కి వెళ్ళాం(40కి మీ) ఇది ఒక దేవాలయాల సమూహం. 

లోపల నరసింహస్వామి రెండు రూపాల్లో ఉంటారు హిరణ్యకశిపుని వధించిన ఉగ్ర రూపం , మరొక చోట యోగా రూపం లో శాంతంగా దర్శనమిస్తారు. యోగ మూర్తికి తొడపై చెంచులక్ష్మి రూపంలో అమ్మవారు ఉంటుంది. ఇంకా వేణుగోపాల స్వామి, యమధర్మరాజు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, కుబేరుడు, ఆంజనేయస్వామి అందరూ అక్కడక్కడ కొలువుతీరి ఉంటారు. ఇది చాళుక్యుల కాలంలో మొదలై కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందింది.  

తర్వాత స్టాప్ కోటిలింగాల....

షోడశ (16) జానపదుల నివాసమున్న ప్రాంతాల్లో ఒకటైన కోటిలింగాల ( పాత కరీంనగర్ ఇప్పటి జగిత్యాల జిల్లా) గోదావరి నది ఒడ్డున ఉంటుంది.   

మునులు కొంతమంది అక్కడ నదీ స్నానం చేసి శివుణ్ణి పూజించాలని హనుమంతుని కాశీ నుంచి శివ లింగం తెమ్మని కోరగా సమయానికి అందక పోవడంతో మునులు గోదావరి గట్టున ఉన్న కోటి ఇసుక రేణువులను తెచ్చి లింగాన్ని తయారు చేసి ప్రతిష్టించి పూజిస్తారు .అందుకే ఇది సైకత లింగం. (కోటేశ్వర /సిద్ధేశ్వర స్వామి.) 

శాతవాహనుల మొదటి రాజధాని, బౌద్ధులు జైనులు నివసించిన ప్రాంతం ( మునుల గుట్ట) . 

నూతన దంపతులు స్వామిని దర్శించి పూజిస్తే వారికి మంచి భవిష్య త్తు ఉంటుందని నమ్ముతారు. పచ్చని  వాతావరణం, కొండలు, గోదావరి బ్యాక్ వాటర్స్ తో అందమైన ప్రదేశం.

పై అన్ని ప్రదేశాలలో హరిత (తెలంగాణ టూరిజం వారి హోటళ్లు ఉన్నాయి) ఇతర ప్రయివేటు వసతి కూడా ఉంది. 

వేములవాడ దేవాలయం చాలా ప్రసిద్ధి. సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది ,మేము అందుకోలేక పోయాం. వర్గల్, రత్నాలయం ముందే చూశాము. అలా మా ఆదివారం అయిపోయింది. అన్ని కవర్ చేయాలంటే రెండు రోజులు సరిపోతుంది తీరిగ్గా చూసిరావడానికి. ( ఉంటె గోదావరిలో బోటింగ్ కూడా చెయ్యొచ్చు వరద నీటి ఉధృతి కారణంగా మేము వెళ్ళినప్పుడు లేదు).

Comments

  1. మీ వ్యాసం తెలంగాణ పర్యాటకులకు ఉపయోగకరం! 👍

    ReplyDelete
  2. మేడం!మీరు దేవుడ్ని ఇంతగా నమ్ముతారా!
    చాలారోజుల తరువాత మీ బ్లాగ్ ఓపెన్ చేశాను. మేడం!

    ReplyDelete

Post a Comment